లిక్కర్ మాఫియాపై సుప్రీం కోర్టు ఉక్కుపాదం మోపింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్రాందీ షాపులు మూసివేయాలని సుప్రీం ఆదేశించింది. ప్రస్తుత లైసెన్స్ ముగిసే వరకు షాపులు కొనసాగించవచ్చని సూచించింది. మార్చి 31తర్వాత హైవేలపై ఉన్న మద్యం షాపులకు లైసెన్స్లను రెన్యువల్ చేయకూడదని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఎరేవ్ సేఫ్ అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో వేసిన పిల్ పై కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జడ్జీలు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ ఎన్ రావులు ఈ తీర్పు నిచ్చారు.
జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలు ఉండటం వల్ల డ్రైవర్లు తాగి వాహనాలు నడుపుతున్నారని, దీనివల్ల ఏటా 1.42 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎరేవ్ సేఫ్ సంస్థ తన పిల్ లో పేర్కొంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో ఏప్రిల్ 1వ తేదీనుంచి జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం విక్రయాలకు బ్రేకు పడనుంది. రహదారులపై మద్యం దుకాణాలు లేనట్లయితే, కొంతమేరకు మద్యపానం సేవించే వారి సంఖ్య కూడా తగ్గనుంది.