ప్రశ్నించటం లోనూ కొత్త పద్దతి మొదలయింది… ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు కొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు ప్రజలు… 17 బ్యాంకుల నుంచి సుమారు 9 వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుని దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాను పట్టుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం. దేశంలోని సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఎంతలా అంటే సామాన్యులు సైతం మాల్యాను ఎందుకు పట్టుకోవడం లేదని పోలీసులనే ప్రశ్నించేంతగా?
మొన్నటి మొన్న తమిళనాడులో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నందుకు గాను ఓ పేద రైతుపై దాడి చేసిన పోలీసులతో అతడి భార్య “మమ్మల్ని కొడుతున్నారు సరే మరి విజయ్ మాల్యాను ఏం చేస్తారంటూ” ప్రశ్నించిందన్న విశయం ఇంకా మర్చిపోకముందే.. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి ముంబైలో ఆదివారం జరిగింది.విజయ్ మాల్యా పై చర్యలు ఎందుకు తీసుకోలేదో కనీసం వివరణ అయిన ఇచ్చేవరకూ తాను టికెట్టు తీసుకోననీ జరిమానా కట్టబోననీ అధికారులకు చుక్కలు చూపించిందో మహిళ వివరాల్లోకి వెళితే..
దక్షిణ ముంబైలో నివసిస్తున్న భులేశ్వర్ ప్రాంతానికి చెందిన ప్రేమలతా బన్సల్ (44) అనే మహిళ ఇంటికి వెళ్తూ ఎల్ఫిన్స్టోన్ స్టేషన్లో లోకల్ రైలు ఎక్కింది. రైలు మహాలక్ష్మి స్టేషన్ వచ్చేసరికి టికెట్ తనిఖీకి వచ్చిన మహిళా టీసీ ఆమెను టికెట్ అడగగా కొనలేదని సమాధానం చెప్పింది. దీంతో ఆమెకు రూ.260 జరిమానా విధించారు. అయితే తాను జరిమానా కట్టబోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు రూ. 10తో టికెట్ కొనలేదని తనని ఫైన్ కట్టమంటున్నారని, బ్యాంకుల నుంచి 9వేల కోట్లు రుణం తీసుకుని దేశం నుంచి పారిపోయిన మాల్యాను ఎందుకు అడగటం లేదని ప్రశ్నించింది. విజయ్ మాల్యాను పట్టుకున్న తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులకు సవాల్ చేసింది. జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమేనని చెప్పింది. దీంతో రైల్వే అధికారులు, పోలీసులు ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు 12 గంటల పాటు వారితో వాగ్వాదానికి దిగింది. ఎంతకీ వినకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసిరైల్వే కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆమెకు వారం రోజులు పాటు జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్టు ముంబై డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా తెలిపారు. దీంతో పోలీసులు ఆమె భర్తకు సమన్లు జారీ చేశారు…
మరికొంత మంది ఇదే తరహాలో ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వం లో కదలిక రాదంటూ వ్యాఖ్యానించిందొక ముంబై లోకల్ పత్రిక.