ప్రముఖ తెలుగు స్టార్ రైటర్ గోపీ మోహన్ దర్శకుడవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి ఈ వార్త వినిపిస్తుందే గానీ మ్యాటర్ మాత్రం షురూ అవ్వలేదు. ఎట్టకేలకు ఆ మధ్య సునీల్ కు ఓ కథ రాశాడు. కానీ సునీల్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లింది. అయితే వచ్చే ఏడాదైనా దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని పట్టుమీద ఉన్నాడు. అందుకే ఓ కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడిక దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నారు. శుక్రవారం నూతన సంవత్సరం తొలి రోజు సందర్భంగా ఆయన తన సినిమా విశేషాలను ఫేస్బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించబోతున్న తొలి చిత్రానికి ఇష్టంగా, సంతోషంగా, ఆనందంగా అనే టైటిల్ని ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి లోగోలతో రూపొందించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. స్పెక్రా మీడియా బ్యానర్పై జి.వి.రమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన తారాగణం తదితర అంశాలను ఫిబ్రవరి లేదా మార్చిలో వెల్లడిస్తామని, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని గోపీ మోహన్ పేర్కొన్నారు.
కాగా గోపీ మోహన్ ఇప్పటికే పలువు రు స్టార్ సినిమాలకు కథ, కథనాన్నిఅందించారు. అలాగే మరో రైటర్ కోన వెంకట్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రూపొందిన దూకుడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో గోపీ మోహన్ పేరు టాలీవుడ్ లో బాగా వెలుగు లోకి వచ్చింది. అలాగే సంతోషం, ఢీ, రెడీ వంటి సినిమాలకు ఈ ద్వయం కథలు అందించిన సంగతి తెలిసిందే.