సంస్థలకు.. కాంట్రాక్టర్లకు మధ్య జరిగే ఒప్పందాల్లో తేడాలు వచ్చినట్లైతే… న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంటుంది ఇది అందరికి తెలిసిన విషయమే. కాంట్ట్రాక్టర్లు పనిని నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోతే.. కొన్ని సందర్భాల్లో జరిమానా విధించి అదనపు సమయం ఇస్తారు. లేదా ఒప్పందం ఉల్లంఘించారని కేసు పెట్టి కోర్టులో హాజరు పరుస్తారు. అయితే.. రష్యాలోని ఓ ఈ-కామర్స్ సంస్థ మాత్రం కాస్త వెరైటీగా చేసింది. ఒప్పందం ఉల్లఘించాడని ఓ గుత్తేదారును ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టేసింది.
రష్యాకి చెందిన ‘పిచ్షాప్’ ఆన్లైన్ గిఫ్ట్స్టోర్ సంస్థ 21 సంవత్సరాల వయస్సు గల అలెగ్జాండర్ క్రామరెంకో అనే కాంట్రాక్టర్తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అలెగ్జాండర్.. పిచ్షాప్ సంస్థ ఇచ్చిన ఫ్లోర్బోర్డులపై డిజైన్లను స్క్రీన్ప్రింట్ చేసి ఇవ్వాలి. కానీ.. అనుకున్న సమయానికి అలెగ్జాండర్ పనిని పూర్తి చేయలేకపోయాడు. దీంతో అతను నిబంధనల ప్రకారం 51వేల డాలర్లు(సుమారు రూ. 35లక్షలు) తిరిగి ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంది. కానీ.. అతను అంత డబ్బు చెల్లించే పరిస్థితిలో లేడు. దీంతో పిచ్షాప్ సంస్థ అలెగ్జాండర్పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
కేసు పెట్టినా డబ్బులు తిరిగి రావని భావించిందో ఏమో గానీ.. పిచ్షాప్ అతనిపై కేసు వేసే బదులు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకుంది. వారి ఆన్లైన్స్టోర్లో అలెగ్జాండర్ను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకుంది. అలెగ్జాండర్ కూడా కేసు.. శిక్షలకంటే అమ్ముడుపోవడం ఉత్తమం అనుకొని వారిచ్చిన ఆఫర్కు ఒప్పుకున్నాడట.
దీంతో పిచ్షాప్ అలెగ్జాండర్ ఫొటోలు.. అతని పూర్తి వివరాలను పొందుపర్చి ఏడాది వారంటీతో తమ ఆన్లైన్ స్టోర్లో అమ్మకానికి పెట్టింది. తమతో ఒప్పందం కుదుర్చుకున్న అలెగ్జాండర్ నిర్ణీత సమయానికి పని పూర్తి చేయలేకపోయాడని, దీంతో అతను బాకీ పడ్డ డబ్బును వసూలు చేసేకునేందుకు అతనిని అమ్మకానికి పెట్టామని పేర్కొంది. ఎవరు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తారో వారిని అలెగ్జాండర్ వివాహం చేసుకుంటాడట. 35 ఏళ్ల వయసులోపు మహిళలే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. అయితే ఈ వివాహం కేవలం ఏడాది వరకే చెల్లుతుంది. ఏడాదిపాటు కొనుగోలు చేసిన వ్యక్తికి అలెగ్జాండర్ భర్తగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఒప్పందం రద్దయిపోతుంది. ఈ వినూత్న అమ్మకం ద్వారా తమ సంస్థకు మరింత ప్రచారం జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట.
అలెగ్జాండర్ను కొనేందుకు డిసెంబర్ 20తేదీ వరకు గడువిచ్చారు. ఆ సమయానికి 200 మంది వేలంపాటలో పాల్గొన్నారు. అయితే అందులో చాలామంది మగవాళ్లు కూడా ఉన్నారట. నిబంధన ప్రకారం మహిళల్నే పరిగణనలోకి తీసుకుంటారు. వారిలో ఎవరు ఎక్కువ ధర పెట్టారో వారికి అలెగ్జాండర్తో వివాహం జరిపిస్తారట.