Home / Inspiring Stories / 25 రూపాయల పెట్రోల్ ని 60 రూపాయలకు అమ్ముతున్నారు.

25 రూపాయల పెట్రోల్ ని 60 రూపాయలకు అమ్ముతున్నారు.

Author:

Petrol Bunk Prices In india

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా  ఆ పాపం తమది కాదని అంతర్జాతీయ మార్కెట్‌దని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పడం, అవును కాబోలు! అనుకొని వినియోగదారులు తలాడించడం తరచుగా జరిగేదే. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేందుకు, తగ్గించేందుకు భారతీయ చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పుకోవడమూ షరా మామూలే. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే అంతకన్నా ఎక్కువ ధర ఎందుకు పెరుగుతుంది? తగ్గినప్పుడు ఎందుకు తక్కువ తగ్గుతుందన్న విషయాల్లోకి లోతుగా వెళ్లం, వెళ్లినా ప్రభుత్వం తీరే అంతా! అని సరిపెట్టుకుంటాం.

ప్రస్తుతం పెట్రోలు ఉత్పత్తి రేటుకన్నా దేశీయ మార్కెట్‌లో లభిస్తున్న పెట్రోలు, డీజిల్ ధరలు రెట్టింపు, అంటే వంద శాతం ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యం వేస్తోంది. ఢిల్లీ నగరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇక్కడ లీటరు పెట్రోలును 59.35 రూపాయలకు విక్రయిస్తున్నారు. డిసెంబర్ చివరి వారం లెక్కల ప్రకారం లీటరు పెట్రోలు ఉత్పత్తి చేయడానికి  ఆయిల్ రిఫైనరీస్‌కు అక్షరాల 23.60 రూపాయలు ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చు లను, లాభాలను లెక్కేసుకొని ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పంపులకు 26.09 రూపాయలకు లీటరు చొప్పున విక్రయిస్తున్నాయి. దానిపై డీలర్ కమిషన్ లీటరుకు 2.26 రూపాయలు. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం 19.06 రూపాయలు, వ్యాట్, రాష్ట్రం విధించే అమ్మకం పన్ను కలిపితే మరో 16.14 రూపాయలు. మొత్తంగా కలిపి వినియోగదారుడికి వచ్చేసరికి లీటరుకు 64.24 రూపాయలు పడుతోంది.

అలాగే, ఢిల్లీలోని పెట్రోలు పంపులో లీటరు డీజిల్ ధర 45.03 రూపాయలు. చమురు కంపెనీలకు ఖర్చయ్యేది కేవలం లీటరుకు 24.36 రూపాయలే. కొంత మార్జిన్‌ను కలుపుకొని పెట్రోలు పంపులకు విక్రయిస్తాయి. దీనిపై డీలర్ కమిషన్ 1.43 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం 10.66 రూపాయలు. వ్యాట్, అమ్మకం పన్ను కలుపుకుంటే మరో 6.79 రూపాయలు. మొత్తం కలపి వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి లీటరుకు 45.93 రూపాయలు అయింది. క్రూడాయిల్ ధరలు తగ్గిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినట్టే తగ్గించి,ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ మన నుండి ఎక్కువ పన్నులు వసూలు చేస్తుంది.

ఇప్పుడు పైన చెప్పిన లెక్కలు క్రూడాయిల్ ధర 50 డాలర్లు ఉన్నప్పటివి.ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర 35 డాలర్లకొచ్చింది.అంటే పెట్రోల్ శుద్ధిచేయడానికి ఖర్చు ఇంకా తక్కువ అవుతుంది.ఈ కాలంలో రూపాయి విలువ డాలర్ తో పోల్చుకున్నపుడు బాగా తగ్గడం వలన కొంత ప్రభావం పెట్రోల్ పైన కూడా పడి,ధర తగ్గకపోవడానికి అది కూడా ఒక కారణం అయినప్పటికీ…దాని ప్రభావం కొంచెం మాత్రమే.అసలు టాక్స్ లు వేయొద్దని ఇక్కడ ఎవరూ అనడం లేదు.ముడిసరుకు ధర సుమారు 60% పైగా తగ్గినపుడు(112 డాలర్ల నుండి 50 డాలర్ల దిగువకు),మన నిత్యావసరమైన పెట్రోల్ ధర కనీసం 20% కూడా తగ్గలేదు.25 రూపాయలు ఖర్చయ్యే పెట్రోల్ ని,మన బాగుకోరే నాయకులు కేవలం 30 రూపాయలు మాత్రమే టాక్స్ వేసి మనకు 65 రూపాయలకు అందిస్తున్నారు.

మన తెలుగు వాళ్ళకు మాత్రమే ఉన్న బంపర్ ఆఫర్ ఏమిటంటే… దేశంలోనే అత్యధిక వ్యాట్ ఉన్న రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ముందున్నాయి. హైదరాబాద్ లో అయితే ఇంకా టాక్స్ లు కలిపి పెట్రోల్ ని 65 రూపాయలకు, డీజిల్ ని 50 రూపాయలకు అమ్ముతున్నారు.అదే గోవాలో 15%,అంటే సుమారు మనకంటే 10 రూపాయలు తక్కువ.మేము ప్రజలకు అది చేసాం,ఇది చేసాం అని ఊరంతా హోర్డింగ్ లతో నింపేస్తున్న మన నాయకగణం దీని గురించి కూడా ఒక మాట ఎక్కడైనా ప్రస్తావిస్తే చాలా బాగుంటుంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పన్నులు తక్కువగా ఉండడం వల్ల అక్కడ వినియోగదారుడికి కారుచౌకగా పెట్రోలు లభిస్తుంది. అమెరికాలో ఏ ప్రభుత్వమైనా పెట్రోలుపై పన్నులు పెంచితే ఆ ప్రభుత్వం పడిపోతుంది. భారత్‌లాంటి దేశంలో ఆ పరిస్థితులు ఎప్పుడొస్తాయో!

Must Read: తండ్రికిచ్చిన మాటకోసం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు.

(Visited 715 times, 1 visits today)