“పేదవాడి ఫ్రిడ్జ్ మట్టికుండ” పర్యావరణానికి ఏమాత్రం హానికలిగించని కుండని ఫ్రిడ్జ్ అని ఎలా అన్నారో కానీ నిజానికి కుండ అనేది వాటర్ కూలర్ మాత్రమే దానిలో కూరగాయలనీ,లేద పళ్ళనీ ఆహార పథార్థాలనీ ఉంచలేం కదా…! ఐతే గుజరాత్లోని రాజ్కోట్ జిల్లా మోర్బికి చెందిన మన్సుఖ్ భాయ్ కి మాత్రం ఆ మాటని నిజంగా అమల్లో పెట్టి మట్టి తో ఫ్రిడ్జ్ ని తయారు చేసాడు.
రిఫ్రిజ్రేటర్ లో ఉండే సన్నని చానెల్స్ ద్వారా ప్రవహించే నీరు లోపల ఉన్న పథార్థాలని చల్లగా ఉంచుతుంది. అంటే లోపల వెలువడే ఆవిరినే చల్లగా ఉంచే ఆలోచన అన్నమాట. (కొన్ని సార్లు కూరలు వండుతూ పై మూత మీద చల్లటి నీళ్ళు పోసి లోపలి ఆవిరినే ఆపేస్తూంటాం కదా అలాంటిదే.) ఇలా చేయటం వల్ల లోపల ఉండే పళ్ళూ,కూరగాయలూ వంటివి తాజాగా ఉంటాయి. అంతే కాదు దీనికి కరెంట్ అవసరం లేదు,క్లోరో ఫ్లోరో కార్బన్ ల వంటి విష వాయువులూ ఉండవు.పూర్థి స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఫ్రిడ్జ్ అన్న మాట. దీని ఖరీదు ఎంతో తెలుసా..? మూడువేలు కేవలం మూడువేలు… అంతే కాదు వాట ఫిల్టర్,కుక్కర్,ఫ్రయింగ్ ప్యాన్ ఇలా ఎన్నో గృహోపకరణాలని మట్టితోనే తయారు చేసాడు… “నిజంగా నీలాంటి ఇంజినీర్ ఈ దేశానికే కాదు,ఈ ప్రపంచానికే ఇప్పుడు ఎంతో అవసరం” అంటూ మన దివంగత భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మన్సుఖ్ భాయ్ ని మెచ్చుకున్నారు…
ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి హాని పెరుగుతున్న ఈ రోజుల్లో ‘ఎకో ఫ్రెండ్లీ’ వస్తువులను తయారుచేయడం మన్సుక్బాయ్కి కలిసొచ్చింది. పెద్ద పెద్ద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ‘గుజరాత్ గ్రాస్రూట్ ఇన్నొవేషన్ నెట్వర్క్’, ‘నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్’ మన్సుక్బాయ్ కనిపెట్టిన వస్తువులకు పేటెంట్ ఇప్పించాయి.
అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రొఫెసర్లు కార్పొరేట్ మార్కెటింగ్, ప్యాకింగ్, టెస్టింగ్లలో సలహాలు ఇచ్చారు. గుజరాత్ ఎగ్జిబిషన్, న్యూఢిల్లీలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్’ వాళ్ల నుంచి ఆహ్వానాలు అందాయి. మిట్టీకూల్ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శనకు పెట్టి అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించాడు మన్సుక్బాయ్. అంతర్జాతీయ సంస్థలైన బోస్, సీమెన్స్లాంటి కంపెనీలు ఆసక్తి చూపాయి.
ఐతే ఇంతా చేస్తే మన్సుఖ్ చదువుకున్నదేంటో తెలుసా..? 10 తరగతి అది కూడా ఫెయిల్. ఫ్రిడ్జ్ కి ముందు ఆయన ఏం చేసే వారో తెలుసా? కుటుంబంతో కలిసి మట్టికుండలు చేసే వాడు. “ఈ కుండలతో నీ జీవితానికి సరిపోయే డబ్బు నువ్వు సంపాదించుకోలేవు. వేరే ఏదైనా పని చూసుకో” వాళ్ళ ఇంట్లో చెప్పిన మాటలివి. రకరకాల పనులు ప్రయత్నించాక మన్సుఖ్ కి ఒక విషయం అర్థమైంది “నేను మట్టి పని తప్ప మరోటి చేయలేను” అని అనిపించాక… మరో ఆలోచన కూడా మొదలైంది.. కుండలతో ఎన్నాళ్ళు,ఎంత సంపదించగలం… అప్పుడు వచ్చిన ఆలోచనే వాటర్ ఫిల్టర్ “మట్టితో”…. తర్వత కుక్కెర్..ఆ తర్వాత ఫ్రిడ్జ్…
“ఈ ప్రాజెక్ట్ కి లోన్ ఇవ్వటం మావల్ల కాదు” 30,000 రూపాయల బ్యాంక్ లోన్ అప్లయ్ చేసినప్పుడు. బ్యాంకు అధికారులన్న మాట ఇది.అయినా వదల్లేదు బతిమాలాడు,తన ప్రోడక్ట్ గురించి మళ్ళీ మళ్ళీ వివరించాడు ఎట్టకేలకు లోన్ సంపాదించాడు. “మిట్టీ కూల్” కంపెనీ మొదలైంది. మట్టి ఫ్రిజ్లో కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎనిమిది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇవన్నీ సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోవు. రుచి కూడా తగ్గదు. అందులోనూ కరెంటు అవసరమే లేదు. మట్టి వాటర్ ఫిల్టర్ కూడా అంతే. అందులో పోసిన నీళ్లు శుభ్రంగా, చల్లగా ఉంటాయి. మట్టికుక్కరు వీటిని ముంబయిలోని ‘టాటా కెమికల్స్’ వాళ్ల చేత పరీక్ష చేయించాడు. వాళ్లు ఓకే అన్నారు. అంతలో అనుకోకోకుండా గుజరాత్ వచ్చిన ఓ రోజు నైరోబి దేశస్థుడు మిట్టీకూల్ను సందర్శించి, అక్కడికక్కడే 500 మట్టి వాటర్ఫిల్టర్లు కావాలని ఆర్డర్ ఇచ్చేశాడు. అదే మన్సుక్బాయ్కి తొలి విజయం. తనమీద తనకు విశ్వాసం కలిగించిన అమ్మకం. ఒక్కో ఫిల్టర్ కేవలం రూ.400 చొప్పున అమ్మేశాడు. బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిజ్ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ.
ఆ వార్త గుజరాత్ పత్రికల్లో పడింది. మిట్టీకూల్కు పెద్ద అడ్వర్టైజ్మెంట్నే తెచ్చిపెట్టింది. దాన్ని చూసి ముంబయి, పాట్నా, పూణెల నుంచి కుప్పలుతెప్పలు ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్ ఎంత వరకూ వెళ్లిందంటే 50 వేల మట్టిపాన్లు అమ్మే వరకూ వెళ్లింది. మట్టిఫ్రిజ్ రూ.2,500 ధర పెట్టినా చాలామంది ఉత్సాహంగా కొనుక్కెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేసి తెప్పించుకున్నారు. మిట్టీకూల్ మన్సుక్బాయ్ పేరు గుజరాత్ అంతటా మార్మోగింది. ఇప్పుడు మిట్టీ కూల్ టర్నోవర్ 50 లక్షలు. ఈ కంపెనీలో 35 మంది పని చేస్తున్నారు… ఈ టెన్త్ ఫెయిల్ ఇంజినీర్ విజయ గాథని అతని మాటల్లోనే వినండి….
Must Read: దేశంలోనే నంబర్ వన్ సిటీ గా హైదరబాద్.